Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

చలం యోగ్యతా పత్రం


మహా ప్రస్థానం పీఠిక

జూన్ 15. మహాకవి శ్రీశ్రీ అస్తమయ దినం. ఈ సందర్భంగా శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటికి చలం రాసిన చారిత్రాత్మక యోగ్యతా పత్రాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నా. ముందుగా యోగ్యతాపత్రం పీఠిక ప్రాముఖ్యతను చూడండి.

యోగ్యతా పత్రం

శ్రీ శ్రీ వ్రాసిన మహాప్రస్థానం పుస్తకానికి 1940లో చలం రాసిన పీఠిక. తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పీఠికలలో ఇది ఒకటి. ఆ పుస్తకం ఎవరు చదవాలో, ఎందుకు చదవాలో, ఎలా చదవాలో వివరించే పీఠిక అది. రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల షడ్జధ్వానం విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి. అంటూ పుస్తకం చదవడానికి పాఠకుడిని సమాయత్త పరచే పీఠిక అది.

మహాప్రస్థానంలోని రచనలకు దీటుగా ఈ ఉపోద్ఘాతం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైంది. "యోగ్యతా పత్రం" అన్న శీర్షికతో వ్రాయబడిన ఈ ముందుమాట తెలుగు రచనలలో అత్యంత ప్రసిద్ధమైన ముందుమాటలలో ఒకటి. చలం మాటల్లో అంత శక్తి, వాడి(పదును) అలోచింపజేయగల శక్తి ఉన్నాయి. యోగ్యతాపత్రంలో చలం రాసిన కొన్ని వాక్యాలు మచ్చుకు ఇక్కడ చూడండి.

"..ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాథంలోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరిబిక్కిరై తుఫానుహోరు చెవుల గింగురుమని, నమ్మిన కాళ్ళకింది భూమి తొలుచుకు పోతోవుంటే, ఆ చెలమే నయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.

శ్రీ శ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆ రెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి కిర్రుమనేట్టు ఇద్దరూ అరుస్తారు. ఏమీ రసం లేకుండా flat గా ఎక్కడికో, ఏమీ చేతగానివాళ్ళమల్లే జారిపోతారు.

కాని ఆ అరుపుల్లో, చీకట్లో మొహాలూ, తోకలూ కనపడక వెతుక్కునే ప్రజల రొద, గాలిదెబ్బల కింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం, మర ఫిరంగుల మరణ ధ్వానం, గింగురు మంటాయి. కంఠం తగ్గించి వినపడకుండా తగ్గు స్థాయిలో మూలిగారా, దిక్కులేని దీనుల మూగవేదన, కాలి కింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్ళు లేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం వినిపింప జేస్తారు.

బుద్ధి వున్నవాడెవ్వడూ అతనిది సంగీతమని కాని, ఇతనిది కవిత్వమని కాని వొప్పుకోడు; వొప్పుకోటమూ లేదు. ఎందుకంటే ఈ ఇద్దరి Appeal బుద్ధిని, వివేకాన్ని, కళాబంధనల్ని మించిన ఏ అంతరాళానికో తగులుతుంది -ఆ అంతరాళం అనేది వున్న వాళ్ళకి.

...శ్రీ శ్రీ "ఆకలేసి" నక్షత్రాలు అదిరిచూసే "కేకలేశాడు." ఈ కవికి ఆకలివేస్తే రా- గారి యింటికెళ్ళి శ్లాఘించి భత్యఖర్చు తెచ్చుకుని, భోజనం చేసి ప్రియురాలిమీద గీతం వ్రాశాడు."

తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీ శ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చెలం. తూచవద్దు, అనుభవించి పలవరించమన్నాడు శ్రీ శ్రీ.

శ్రీశ్రీ నిర్వహించిన ప్రజ శీర్షికలో పిచ్చయ్య అనే పాఠకుడు ఇలా ప్రశ్నించాడు "యోగ్యతా పత్రం చదివితే మహాప్రస్థానం చదవనక్కరలేదని నేను అంటాను, మీరేమంటారు." అతిశయోక్తి అయినా, అంతటి గుర్తింపు పొందిన పీఠిక అది.

అయితే శ్రీశ్రీ ఆ పాఠకుడి ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు 'మీరు సార్ధక నామధేయులంటాను.'

యోగ్యతాపత్రం
యోగ్యతాపత్రాన్ని మన మాటల్లో వ్రాయడం కన్నా చలం భాషలో వ్రాస్తేనే దానికి సార్థకత. అందుకే చలం వ్రాసిన యోగ్యతాపత్రం యధాతధంగా మరో పోస్టులో ఇస్తున్నా.

స్పందనలు

Re: చలం యోగ్యతా పత్రం
అయితే శ్రీశ్రీ ఆ పాఠకుడి ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు 'మీరు సార్ధక నామధేయులంటాను.' అది సమాధానమే అయినా.. దానికర్థమేంటో పూర్తిగా నా కర్థం కావడం లేదు. దయచేసి చెబుతారా. శ్రీశ్రీగారి సమాధానంలోని నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరని భావిస్తున్నా. గొప్పవాళ్ల మాటలు అంత త్వరగా సామాన్యులకు అర్థం కావంటారు. బహుశా ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు.
Re: చలం యోగ్యతా పత్రం
చాలా సింపుల్. శ్రీశ్రీని ఆ ప్రశ్న అడిగింది పిచ్చయ్య అనే అతను. యోగ్యతాపత్రం రాయడం వల్లే శ్రీశ్రీ మహాప్రస్థానంకి అంత పేరొచ్చిందంటాను. మీరేమంటారు అని ఆతడు శ్రీశ్రీని ప్రశ్నించాడు. మాటలను విరవడంలో, సంధించడంలో శ్రీశ్రీ ఘనాపాటీ కదా. అందుకని పిచ్చయ్య గారూ మీరు నిజంగా పిచ్చయ్యే అనే అర్థంలో సార్థక నామధేయులు అని ఎకసెక్కం చేశాడు శ్రీశ్రీ. మరి తన కవిత్వం గొప్పేమీ లేదు అంతా చలం రాసిన ముందుమాటదే ఘనత అంటే ఎంత మహాకవికయినా ఒళ్లు మండదూ మరి. చలం రాయబట్టి శ్రీశ్రీ కవితలు తెలుగు లోగిళ్లలోకి బుల్లెట్ వేగంతో దూసుకుపోయాయంటే నిజమే కావచ్చు. కాని శ్రీశ్రీ కవితల్లో ఏమీ పస లేదు అంటే అది వాస్తవ విరుద్ధమే కదా. వీలయితే విశాలాంధ్రలో మహాప్రస్థానం దొరుకుతుంది. కొని చదవండి మరోసారి.
Re: చలం యోగ్యతా పత్రం
శ్రీశ్రీ మహాప్రస్తానం కన్నా ఈ మద్య వెబ్ లొ చలం యోగ్యతా పత్రం గొప్పతనం బురించి ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. శ్రీ శ్రీ ఒరిజినల్ వాయిస్ కాసెట్ లో దాని గురించి చెపుతూ అది జలక్ శాస్థ్రి పనికట్టుకొని రాయించిన పత్రంగా చెపుతారు. ఇది గూటం క్రిష్ణమూర్తిగారు ప్రచురించిన శ్రీశ్రీ ఫాసిమైల్, గొంతు కలిపిన్ మహాప్రస్తానామ లో వుంది. చలం గొప్పతనం గురించి నేను ఇక్కడ కించపరచాలని కాదు. కాని మన చర్చ ఎటో వెల్లిపోకూడదని.
Re: చలం యోగ్యతా పత్రం
మీరన్నది నిజమే... కానీ యోగ్యతా పత్రాన్ని ఎవరు రాయించినా, కవిత్వాన్ని తూచే రాళ్లు తన దగ్గర లేవని ముందు తటపటాయించిన చెలమే తర్వాత శ్రీశ్రీ మాట ప్రేరణగా అనుభవించి, పలవరించి యోగ్యతా పత్రాన్ని రాశారు. శ్రీశ్రీ కవితలకు ముందుమాట రాయడానికి వెనుక ఉన్న నేపధ్యాన్ని చెలమే స్వయంగా చెప్పుకున్నారు. కవిత్వం అన్నా, తెలుగు కవితా కన్యకలు అన్నా తీవ్రంగా అనుమానించే చెలం, మాటల్ని కత్తులూ, ఈటెలూ, మంటలుగా మార్చటంలో శ్రీశ్రీ మహాప్రస్థానంలో చూపిన తెగువకు, ప్రతిభకు దాసానుదాసుడై పోయారు. అందువల్లనే దిక్కుల్ని, దేవుల్ని, అధికారుల్ని వూగించి ప్రశ్నించే శ్రీ శ్రీ పద్యాలపై అంత అభిమానం చూపారాయన. నెత్తురూ, కన్నీళ్ళూ తడిపి కొత్త tonic తయారు చేశాడు శ్రీ శ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి అంటూ చెలం ఆ ముందుమాటలో ఊగిపోయారు. ఇది శ్రీశ్రీ ఘనతే మరి. ఆ తర్వాత ఆంధ్ర దేశమే శ్రీశ్రీ కవితావేశంలో వెర్రెత్తి ఊగిపోయిందనుకోండి. అదొక చరిత్ర. 'వెబ్‌లొ చలం యోగ్యతా పత్రం గొప్పతనం గురించి ప్రచారం ఎక్కువగా జరుగుతోంది' అన్నారు. ప్రచారం చేసుకోనివ్వండి. తప్పు లేదు. కానీ శ్రీశ్రీ రచనల కంటే పై స్థానంలో యోగ్యతా పత్రాన్ని నిలిపి ఉంచేవారు ఎవరైనా కావచ్చు. కాని వారు చెలం యోగ్యతా పత్రం సారాంశాన్ని సరిగా అర్థం చేసుకోలేదనే అంటాను. ఇలాంటి వారు మళ్లీ ఓసారి మహాప్రస్థానం పుస్తకం కొని శ్రీశ్రీ కవితలను ముందుగా చదివి తర్వాతే దాని పీఠికను చదివితే బాగుంటుందని నా సలహా.. శ్రీశ్రీ కవితలను ఎక్కడా లేనంత గొప్పగా అన్వయించి పేలిన ఆకలిరాజ్యం సినిమాను కూడా ఓసారి చూస్తే బాగుంటుందేమో... తక్షణ స్పందనకు నెనర్లు
Re: చలం యోగ్యతా పత్రం
మీరన్నది నిజమే... కానీ యోగ్యతా పత్రాన్ని ఎవరు రాయించినా, కవిత్వాన్ని తూచే రాళ్లు తన దగ్గర లేవని ముందు తటపటాయించిన చెలమే తర్వాత శ్రీశ్రీ మాట ప్రేరణగా అనుభవించి, పలవరించి యోగ్యతా పత్రాన్ని రాశారు. శ్రీశ్రీ కవితలకు ముందుమాట రాయడానికి వెనుక ఉన్న నేపధ్యాన్ని చెలమే స్వయంగా చెప్పుకున్నారు. కవిత్వం అన్నా, తెలుగు కవితా కన్యకలు అన్నా తీవ్రంగా అనుమానించే చెలం, మాటల్ని కత్తులూ, ఈటెలూ, మంటలుగా మార్చటంలో శ్రీశ్రీ మహాప్రస్థానంలో చూపిన తెగువకు, ప్రతిభకు దాసానుదాసుడై పోయారు. అందువల్లనే దిక్కుల్ని, దేవుల్ని, అధికారుల్ని వూగించి ప్రశ్నించే శ్రీ శ్రీ పద్యాలపై అంత అభిమానం చూపారాయన. నెత్తురూ, కన్నీళ్ళూ తడిపి కొత్త tonic తయారు చేశాడు శ్రీ శ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి అంటూ చెలం ఆ ముందుమాటలో ఊగిపోయారు. ఇది శ్రీశ్రీ ఘనతే మరి. ఆ తర్వాత ఆంధ్ర దేశమే శ్రీశ్రీ కవితావేశంలో వెర్రెత్తి ఊగిపోయిందనుకోండి. అదొక చరిత్ర. 'వెబ్‌లొ చలం యోగ్యతా పత్రం గొప్పతనం గురించి ప్రచారం ఎక్కువగా జరుగుతోంది' అన్నారు. ప్రచారం చేసుకోనివ్వండి. తప్పు లేదు. కానీ శ్రీశ్రీ రచనల కంటే పై స్థానంలో యోగ్యతా పత్రాన్ని నిలిపి ఉంచేవారు ఎవరైనా కావచ్చు. కాని వారు చెలం యోగ్యతా పత్రం సారాంశాన్ని సరిగా అర్థం చేసుకోలేదనే అంటాను. ఇలాంటి వారు మళ్లీ ఓసారి మహాప్రస్థానం పుస్తకం కొని శ్రీశ్రీ కవితలను ముందుగా చదివి తర్వాతే దాని పీఠికను చదివితే బాగుంటుందని నా సలహా.. శ్రీశ్రీ కవితలను ఎక్కడా లేనంత గొప్పగా అన్వయించి పేలిన ఆకలిరాజ్యం సినిమాను కూడా ఓసారి చూస్తే బాగుంటుందేమో... తక్షణ స్పందనకు నెనర్లు
నిరాకరణ