అమెరికా అందరికంటే పెద్ద సోషలిస్టు అయిపోతోందని ఇప్పుడు ప్రపంచం భయపడుతోంది. కారణం ఉంది మరి.. రెండు వారాల్లోపే ప్రపంచంలోనే అతి పెద్ద కార్పొరేట్ సంస్థల్లో మూడింటిని అమెరికా అమాంతంగా జాతీయం చేసింది. ఇటీవలే వెనిజులాలో హ్యూగో చావేజ్, గతంలో ఇందిరాగాంధీ భారత్లో భారీ సంస్థలను జాతీయం చేయడం ద్వారా సంచలనం రేపారు. మరి తాజాగా అమెరికాయే సోషలిస్టుగా మారిందా?
అమెరికాలో మితవాదులు ప్రస్తుతం దీన్నే తలచుకుని భయపడుతున్నారు, బాధపడుతున్నారు. మరోవైపున దయా దాక్షిణ్యాలు కలికానిక్కూడా లేనిదిగా పేరుపడిన పెట్టుబడిదారీ దేశం అమెరికా అందరినీ మించిన సోషలిస్టు అయిపోతోందేమిటబ్బా అని భారత్లో ప్రగతిశీలవాదులు నివ్వెరపోతున్నారంటే ఆశ్చర్య పడవలసింది లేదు.
ఈ వాస్తవాలకేసి ఓసారి చూడండి. అమెరికా ప్రభుత్వం ఇటీవల జాతీయం చేసిన ఫిన్నీ మే మరియు ఫ్రెడ్డీ మాక్ కార్పొరేషన్లు ప్రపంచంలోనే అతిపెద్ద దివాళా తీసిన కంపెనీలుగా చరిత్రలో స్థానం సంపాదించుకున్నాయి. దివాళా తీసేనాటికి ఈ కంపెనీలు దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల అప్పులను కలిగి ఉన్నాయి. భారత్ స్థూల ఆర్థిక ఉత్పత్తిత కంటే ఇది అయిదు వంతుల అధిక మొత్తం అంటే దిగ్భ్రాంతి కలుగుతుంది.
మూడవదైన ఎఐజి కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద బీమా కంపెనీ. ఈ కంపెనీనే అమెరికా జాతీయం చేసిందంటే ప్రపంచం దిగ్బ్రాంతి చెందుతోంది మరి. గత 80 ఏళ్ల సోషలిస్టు వ్యవస్థల చరిత్రలో ఏ సోషలిస్టు ప్రభుత్వమూ ఇంత భారీ స్థాయి జాతీయీకరణకు పాల్పడలేదంటే బహుశా ఎవరూ నమ్మకపోవచ్చు.
పైగా దేశీయ రుణ వ్యవస్థ కుప్పకూలిపోకుండా కాపాడేందుకు, అమెరికా ప్రభుత్వం 700 బిలియన్ కోట్ల డాలర్ల -70 వేల కోట్ల రూపాయలు- ఆర్థిక సహాయ ప్యాకేజీకి అనుమతి కోరుతూ సెనేట్కు ప్రతిపాదనలు పంపించింది. సెనేట్ దీనికి ఈ వారంలో ఆమోదం తెలిపితే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు మళ్లీ పుంజుకుంటాయని విశ్లేషకుల అంచనా. ఇది
అమెరికా ఇలా ప్రపంచ స్థాయి బ్యాంకులను స్వాధీనం చేసుకోవడానికి వెనుక సంపన్న షేర్హోల్డర్లను కాపాడే ఉద్దేశం ఉందేమో అని వామపక్షవాదులు అనుమానిస్తున్నారు. కానీ, అది నిజం కాదని అంకెలే చెబుతున్నాయి. అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీలకు సంబంధించిన 79.9 శాతం షేర్లను జీరో ముఖ విలువతో స్వాధీనపర్చుకుంది.
షేర్ ముఖ విలువ కూడా సున్నకు చేరుకున్న ఘటన చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. కాబట్టి సంపన్న షేర్ హోల్డర్లు ఈ మహా జాతీయంతో తుడిచిపెట్టుకుపోయినట్లే. పైగా, ఈ మూడు కంపెనీల యజమానులు ఉన్నఫళంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నారు కూడా.
అమెరికా చరిత్రలో అరుదుగా ఇలాంటి ఘటనలు సంభవిస్తుంటాయని విశ్లేషకులు భావన. ఈ భారీ సంస్థల స్వాధీనం వెనుక సంపన్నులను కాపాడే యత్నం లేదు. హౌసింగ్ మార్కెట్ పని సమర్థవంతంగా నిర్వహించడానికి, సాధారణ ప్రజలను కాపాడేందుకే అమెరికా ప్రభుత్వం ఈ అసాధారణ చర్య చేపట్టింది. ఏఐజీ బీమా సంస్థను స్వాధీనం చేసుకోవడం ద్వారా లక్షలాది మంది పాలసీదారుల బీమాను అమెరికా ప్రభుత్వం నిలబెట్టింది.
ఆర్థికపరమైన భయాందోళనలు దేశమంతా వ్యాపించి మొత్తం ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోకుండా అడ్డుకోవడానికే బుష్ ప్రభుత్వం ఇంత భారీ స్థాయి జాతీయీకరణకు పూనుకొంది. 1930ల మొదట్లో పెట్టుబడిదారీ వ్యవస్థను కదిలించివేసిన మహా మాంద్యం పరిస్థితులు సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే ఏర్పడిన విషయం తెలిసిందే.
పెట్టుబడిదారీ శ్రేయోరాజ్యం యొక్క సాధారణ క్రమం ప్రకారం ఆర్థిక నిర్వహణ దిగజారిన సంస్థలను నిలిపివేసి, షేర్ హోల్డర్లకు, మేనేజర్లకు పరిహారం చెల్లించి తర్వాతే తీవ్రంగా దెబ్బతిన్న వారికి సామాజిక భద్రత కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అయితే కార్పొరేట్ సంస్థలు ఎంత పెద్దవంటే అవి కుప్పగూలితే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థే విచ్ఛిన్నమయిపోతుంది. అందుకే ఆర్థిక దిగ్గజాలు కుప్పకూలిపోవడానికి ముందే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుంది. పెట్టుబడిదారీ విధానం దృష్టితో చూసినా ఇది తప్పనిసరి పరిణామం.
మరి ఈ విధంగా చూస్తే అమెరికా సోషలిస్టు దేశంగా మారిందా.. ఈ పదానికి ఉన్న రెండు రకాల అర్థాలను మనం వేరు చేసి చూద్దాం. సోషలిజం అంటే చాలా మంది దృష్టిలో ఉత్పత్తి సాధనాలపై ప్రభుత్వ యాజమాన్యం. అంటే పంటలు, వస్తువులు, సేవలు తయారు చేయడానికి అవసరమైన భూమి, ఫ్యాక్టరీలు, సంస్థలపై ప్రభుత్వానికే యాజమాన్య హక్కులుండటం. సోవియట్ యూనియన్, మావో హయాంలోని చైనాలో ఇలాగే ఉండేది. అయితే అమెరికా ఈ దిశలో నడవటం లేదు.
అయితే సోషలిజానికి మరొక అర్థం కూడా ఉంది. అందరికీ ప్రాధమిక అవసరాలను తీర్చి, ఆర్థికంగా పతనమైన వారికి సామాజిక భద్రతను రూపొందించడం అనే అర్థం కూడా ఉంది. ఈ రెండో అర్థం ప్రకారం అమెరికా చాలా కాలం నుంచే సోషలిస్టు దేశంగా ఉందని, అది మరింత సోషలిజం వైపుకు పోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆధునిక పెట్టుబడిదారీ దేశాలు అన్నీ సంక్షేమ రాజ్యాలే. సంపన్నులపై పన్నులు విధించి, వ్యాపారాన్ని క్రమబద్దీకరించి, అట్టడుగున ఉన్నవారికి సబ్సిడీలను, ప్రత్యేక పథకాలను అందించడానికి అన్ని పెట్టుబడిదారీ దేశాల్లోను విస్తృతస్థాయిలో బ్యూరోక్రసీ -ఉద్యోగస్వామ్యం- అమలవుతోంది. ఇది ఇంకా పెరుగుతుందే తప్ప ఈ దేశాల్లో తగ్గే ప్రశ్నే లేదు.
ప్రజాస్వామిక దేశాలలో కూడా ఇందుకు భిన్నంగా జరగటం లేదు. మార్క్స్ భావనలకు భిన్నంగా ప్రజారాసుల అవసరాలను నెరవేర్చేందుకు శాసన సభ్యులు ఇక్కడ ఎంచుకోబడుతున్నారు. కార్పొరేట్ సంస్థలనుంచి డబ్బులు తీసుకుంటున్నప్పటికీ, ఈ దేశాల్లో శాసనసభ్యులు.. దేశంలోని వినియోగదారులను, రిటైరయినవాళ్లను, వోటు బ్యాంకుగా ఉన్న ఇతరులను కాపాడేందుకు గాను నిత్యం కొత్త నియమ నిబంధనలను రూపొందిస్తున్నారు.
తేడా అల్లా ఏమిటంటే యూరోపియన్ దేశాలతో పోలిస్తే అమెరికాలో శ్రేయోరాజ్యం కాస్త తక్కువగానే ఉంటోంది. అయితే ఇదేమంత పెద్ద వ్యత్యాసం కాదు. సామాజిక భద్రతపై, మెడికేర్, మెడికల్ ఎయిడ్పై ప్రభుత్వం ఖర్చు పెడుతున్న మొత్తం అమెరికాలో రానురాను పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఈ మొత్తం ప్రస్తుతం జీడీపీలో 7 శాతం ఉండగా 2020 నాటికే ఇది 20 శాతానికి భారీగా చేరుకుంటుందని భావిస్తున్నారు.
పౌరులను బాధలనుంచి కాపాడతామని వాగ్దానాలు చేస్తూ అమెరికా రాజకీయనేతలు ఎన్నికల్లో గెలుస్తున్నారు కాబట్టి వారు ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరంగా మారిన కార్పొరేట్ సంస్థల దివాలా నుంచి పౌరులను కాపాడేందుకు ప్రస్తుతం సత్వర చర్యలు చేపడుతున్నారు.
దీంతో పోలిస్తే ఇందిరాగాంధీ సోషలిజం చాలా భిన్నమైనది. ఇందిరాగాంధీ 1960ల చివర్లో చేపట్టిన జాతీయీకరణ పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రభుత్వం పట్టును పెంచి, ఆర్థిక వ్యవస్థ నియంత్రణాధికారాలను చేజిక్కించుకుంది. ఈ చర్యలు సగటు మనిషికి ఎలాంటి ప్రయోజనం కలిగించలేకపోయాయి. అందుకే ఆమె ఆరోజుల్లో ఇచ్చిన గరీబీ హఠావో నినాదం కాస్తా త్వరలోనే అమీరీ హఠావో నినాదంగా మారపోయింది. పేదరికాన్ని నిర్మూలించడం కాకుండా సంపదను నిర్మూలించండంగా ఇది మారిపోయింది.
అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. అమెరికాలో ఇప్పుడు జరుగుతున్న కార్పొరేషన్ల స్వాధీనాలు తాత్కాలికమైనట్టివే. ఒకసారి సంక్షోభం తొలగిపోయిందంటే అక్కడ తిరిగి ప్రయివేటీకరణ మొదలవుతుంది. కార్పొరేషన్ల అప్పులు చెల్లింపు అయిపోయి ఆర్థిక సుస్థిరత్వం ఏర్పడగానే వాటిని తిరిగి ప్రయివేటీకరిస్తారు. అయితే అప్పుడు భారీ పరిమాణంలో కొనసాగటం మాని చిన్న చిన్న విభాగాలుగా ఏర్పడవచ్చు.
ఈ మొత్తం ప్రక్రియలో జాతీయీకరణ అనే పదం తప్పుగా నిర్వచించబడుతోంది. దీన్ని ప్రభుత్వంచే బలవంతంగా జరుగుతున్న పునర్నిర్మాణంగా పిలిస్తే బాగుంటుంది. ముందస్తుగా నెలకొల్పే సామాజిక భద్రతకు ఇది ప్రతిరూపంలా ఉంటుంది. ప్రజలను బాధలనుంచి కాపాడటమే దీని ఉద్దేశం. అయితే మార్కెట్ ఆర్థికవ్యవస్థ చట్రంలోనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇది ఏ రకంగానూ సోషలిజానికి, కమ్యూనిజానికి నమూనా కాదు మరి...
లోడ్ అవుతోంది...
స్పందనలు